వార్తల్లో కనుమూరి బాపిరాజు






తెలంగాణ కమిటీ ఆషామాషీది కాదు: బాపిరాజు  
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అంశంపై కేంద్ర హోం మంత్రి చిదంబరం వేయనున్న కమిటీ అంత ఆషామాషీది కాదని నర్సాపురం ఎంపీ, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన మంగళవారం ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ.. ఈ కమిటీని తక్కువ అంచనా వేయరాదని హెచ్చరించారు.

డిసెంబరు తొమ్మిదో తేదీన చిదంబరం చేసిన చిన్నపాటి ప్రకటనతో మన రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఊహించని విధంగా కొత్త రాష్ట్రాల డిమాండ్లు తలెత్తాయన్నారు. ప్రధానంగా రాష్ట్రాన్ని విభజించనున్నట్టు మీడియాలో వార్తలు వచ్చిన మరుక్షణమే రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో ఉవ్వెత్తున ప్రజలు ప్రజలు ఉద్యమించారన్నారు. 

అందువల్ల మంత్రి చిదంబరం త్వరలో చేయనున్న ప్రకటనను అంత సులభంగా తీసుకోరాదని ఆయన సూచించారు. అన్ని అంశాలను బేరీజు వేసి, దేశంలో మరిన్ని డిమాండ్లు తలెత్తకుండా ఉండేలా ఈ ప్రకటన ఉంటుందన్నారు. అదేసమయంలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర విభజన జరగడం అంత సులభతరం కాదన్నారు. 

అందువల్ల సీమాంధ్ర నేతలతో పాటు.. ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఇకపోతే.. చిదంబరంపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు. ఆయన కేంద్ర హోం మంత్రి హోదాలోనే ప్రకటనలు చేస్తున్నారని, ఆయన చేసే ప్రకటనలను వ్యక్తిగతంగా చూడరాదని ఎంపీ కనుమూరి హితవు పలికారు.






వైఎస్‌ సేవలు ఆదర్శం : కనుమూరి

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సేవలు ప్రపంచ దేశాలకు ఆదర్శమని నర్సాపురం ఎంపి కనుమూరి బాపిరాజు అన్నారు. ధవళసత్యం కళామిత్ర మండలి సంక్రాంతి సంబరాల కార్యక్రమం స్ధానిక ఆఫీసర్స్‌ క్లబ్‌లో గురువారం రాత్రి జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సేవా పురస్కారాన్ని ఎంపి కనుమూరికి, 2009 విశిష్ట వ్యక్తిత్వ పురస్కారాన్ని ఎంఎల్‌ఎ ఈలి నానీలకు వ్యవస్థాపక కార్యదర్శి తాళ్ల నారాయణరావు నేతృత్వంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎంపి కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ అవార్డులతో పదవులతో గర్వం పెరుగుతుందన్నారు. తాను అవార్డులు తీసుకోనని అయితే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరున అవార్డు ఇవ్వడంతో స్వీకరిస్తున్నానన్నారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేదలకు చేసిన సేవలు ప్రపంచ దేశాలకే ఆదర్శమన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి పేరుతో అవార్డు ఇచ్చి సన్మానించడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. డాక్టర్‌ వైఎస్‌ మరణంతో ఎంతో నష్టపోయామన్నారు. 2009 విశిష్ట వ్యక్తిత్వ పురస్కారాన్ని అందుకున్న ఎంఎల్‌ఎ ఈలి నాని మాట్లాడుతూ పేదలకు వైద్య సేవలు చేయడంలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చూపిన మార్గం తనకు ఆదర్శంగా పేర్కొన్నారు. పదవి ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉంటుందన్నారు. ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ప్రచారంలో పస లేదన్నారు. ఎంపి కనుమూరి సహకారం లేకుండా నియోజకవర్గంలో అభివృద్ధి కష్టమన్నారు. రెండో మంచినీటి చెరువు స్థల సేకరణ పై డాక్టర్‌ వైఎస్‌ హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ ఈతకోట తాతాజీ, బివిఆర్‌ కళాకేంద్రం వ్యవస్థాపకుడు బుద్దాల వెంకట రామారావు, కౌన్సిలర్లు మారిశెట్టి సుబ్బారావు, శీలి వెంకటాచలం, బొర్రే సుబ్బారావు, కొల్లి రమావతి, బడుగు వెంకటేశ్వరావు, పిఆర్‌పి నాయకులు యెగ్గిన నాగబాబు, పాలూరి వెంకటేశ్వరావు, దాట్ల జగ్గన్నాధరాజు, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ కరణం అప్పారావు, మాజీ ఎఎంసి ఛైర్మన్‌ గుండుమోగుల రాము, జాతీయ యువజన అవార్డు గ్రహీతలు గట్టిం మాణిక్యాలరావు, జికె ఆనంద్‌ పాల్గొన్నారు.

కనుమూరి బాపిరాజు

Y.S . Rajasekhara Reddy